తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 25 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు అక్టోబర్ 30, బుధవారం నాడు సరూర్ నగర్ మైదానంలో ‘సకల జనుల సమరభేరి’ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సకలజనుల సభ నిర్వహణకు రంగారెడ్డి కలెక్టర్ అనుమతిని నిరాకరించారు. కలెక్టర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టింది. ముందుగా అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వివరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సాయంత్రం 4 గంటల మళ్ళీ విచారణ చేపట్టిన కోర్టు, సరూర్నగర్ మైదానంలో సభ నిర్వహణకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభను నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు కోర్టుకు తెలుపగా, గంటపాటు సభ జరిగే సమయాన్ని తగ్గిస్తూ సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది.
[subscribe]