వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల కాలంలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 వ తేదీ నుంచి ఈ వాలంటీర్లు విధుల్లో జాయిన్ అయ్యారు. అయితే రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు పోస్టులు 70,888 ఉండగా, ప్రస్తుతం 51,718 మంది వాలంటీర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వివిధ కారణాలతో కొంతమంది ఉద్యోగంలో చేరలేదు, వేరే ఉద్యోగాలు రావడంతో మరి కొంతమంది వాలంటీర్లు ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. అలా ఉండిపోయిన 19,170 వార్డు వాలంటీర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 29, మంగళవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి పురపాలకశాఖ, ప్రభుత్వం అనుమతి కోరడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది.
మరో వైపు ఖాళీగా ఉన్న 9,674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీ తో పాటు వార్డు వాలంటీర్ల భర్తీకి కూడ నవంబర్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. దరఖాస్తు పక్రియ సైతం అదే రోజు మొదలవనుంది. వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తుకు చేయడానికి నవంబర్ 10 చివరి తేదీ కాగా, నవంబర్ 15 లోపు దరఖాస్తుల పరిశీలనను పూర్తిచేస్తారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఫలితాలను నవంబర్ 22న విడుదల చేసే అవకాశం ఉంది. 29, 30 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ 1 నుంచి వాలంటీర్లు విధుల్లో చేరడంతో నియామక పక్రియ ముగుస్తుంది.
[subscribe]