సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. అక్టోబర్ 30, బుధవారం నాడు ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ ఫిలింనగర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆమెకు 72 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 1947 సంవత్సరంలో గీతాంజలి జన్మించారు. సినిమా రంగంలోకి ప్రవేశించాక తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుని చిత్రరంగంలో తనదైన ముద్ర వేశారు. మొదటగా 1961 సంవత్సరంలో ఎన్టీఆర్ దర్శకత్వం వహించి, నటించిన ‘సీతారాముల కళ్యాణం’ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించడంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. సీనియర్ నటుడు రామకృష్ణ సరసన పలు చిత్రాల్లో నటించారు, తరువాత ఆయన్నే వివాహం చేసుకున్నారు. డాక్టర్ చక్రవర్తి, గూఢచారి116, కాలం మారింది, బొబ్బిలియుద్ధం, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, పూల రంగడు, శారద, పూలరంగడు వంటి హిట్ చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు.
కొన్నేళ్ల విరామం తరువాత తెలుగు సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో, పలు సీరియళ్లలోనూ నటించారు. పెళ్ళైన కొత్తలో, మాయాజాలం, గోపి గోపిక గోదావరి, భాయ్, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి మొత్తం 500 పైగా చిత్రాల్లో నటించి అలరించారు. నంది అవార్డు కమిటీ మెంబర్గా కూడా ఆమె పనిచేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కూడ చాలా కాలంగా సేవలు అందిస్తున్నారు. ఆమె మృతి పట్ల మా అధ్యక్షుడు నరేష్, ఉపాద్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర అసోసియేషన్ సభ్యులు సంతాపం ప్రకటించారు. నందినగర్లోని ఆమె నివాసంలో గీతాంజలి భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.