దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడంతో పాటుగా కరోనాకు చికిత్స పొందుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత కరోనా బారినపడి కన్నుమూశారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాకు చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత 15 రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయనకు విశాఖలోని ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టు వైద్యులు తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో సబ్బం హరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖ మేయర్ గా పనిచేసిన సమయంలో విశాఖపట్నం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక 2019 నుంచి ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. సబ్బం హరి మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పలువురు కీలక నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
“తెలుగుదేశం నేత, విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరిగారి మరణం బాధాకరం. రాజకీయాలలో ఆద్యంతం విలువలకు కట్టుబడి ఉన్న సబ్బం హరి గారి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ