తెలంగాణలో సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నవంబర్ 4, సోమవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. మొదటగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోత్కుపల్లి సమావేశమయ్యారు, పార్టీలో చేరిక, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి నరసింహులు పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్రావు, వీరేందర్ గౌడ్లు అమిత్ షాను, జేపీ నడ్డాను కలిసిన వారిలో ఉన్నారు.
మోత్కుపల్లి చాలాకాలం పాటు టీడీపీలో కొనసాగారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ఆ సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ఊహాగానాలు కూడ వినిపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ పార్టీ మద్దతుతో పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల కాలంలో పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే మోత్కుపల్లి బీజేపీలో చేరారు.
[subscribe]