ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలు అమలుకు స్వీకారం చుడుతున్నట్టు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధాప్య పింఛన్ రూ. 2250 అందజేస్తున్నామని చెప్పారు. ఈ నెలలోనే ఇప్పటికి పెండింగ్ లో ఉన్న 5.4 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామ వాలంటీర్స్, గ్రామ సచివాలయాల ద్వారా ఇతర అర్హులైన వారిని కూడా గుర్తించి, వారికీ కూడా సంతృప్తికరస్థాయిలో పథకాన్ని అమలు లోకి తెస్తామని పేర్కొన్నారు.
ఎన్నికలకు మూడు, నాలుగు నెలలు ముందు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హడావిడిగా , 2018-19 సంవత్సరానికి గాను రూ. 8,234 కోట్లు ఖర్చు చేసిందని, వైసీపీ ప్రభుత్వం నెల తిరగకుండానే రాష్ట్రంలో పింఛన్లు కోసం రూ. 15, 675 కోట్లు ఖర్చు చేసిందని ప్రకటించారు. సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి గ్రామ వాలంటీర్స్ మీ ఇంటికే వచ్చి, తలుపు తట్టి పింఛన్ అందజేస్తారు అని చెప్పారు. సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తామని, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని 7 నెలలు ముందే అమలు చేస్తామని, రైతులకు అనుకోని కారణాల వాళ్ళ ఏదైనా జరిగితే రూ. 7 లక్షల రూపాయలు అందజేస్తామని సభలో ప్రకటించారు.