కర్ణాటకలో అనర్హత వేటు ఎదుర్కొంటున్న 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు నవంబర్ 13, బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. వారిపై మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ విధించిన అనర్హత వేటును కోర్టు సమర్ధించింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు పోటీ చేయరాదని స్పీకర్ విధించిన నిబంధనను మాత్రం కోర్టు కొట్టివేసింది. స్పీకర్ విధించిన అనర్హత వేటును మేం సమర్థిస్తున్నాం, అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఈ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్కు లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో అనర్హతకు గురైన 17మంది ఎమ్మెల్యేలు డిసెంబరు 5న జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కోర్టు తెలిపింది. అదే విధంగా అనర్హత అంశంపై ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
గత జులై నెలలో కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసి, ప్రస్తుత అసెంబ్లీ కాలం 2023 సంవత్సరం ముగిసేవరకు అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిబంధన విధించారు. ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ కృష్ణమురారీతో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపి అక్టోబర్ 25న తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు సుప్రీం కోర్టు ఎమ్మెల్యేల పిటిషన్ పై తుది తీర్పును వెలువరించింది. మరోవైపు కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ ఇటీవలే ప్రకటించారు. అలాగే ఫలితాలను డిసెంబర్ 9న విడుదల చేయనున్నారు. కోర్టు తీర్పుతో అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిగింది.
[subscribe]