ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన చేసే విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ, మండల, జడ్పీ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 14 నుంచి 21 వరకు నిర్వహించే ఇసుక వారోత్సవాలపై చర్చించి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు పాటు జైలు శిక్ష విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
అలాగే మొక్కజొన్న ధరలు తగ్గిపోతుండడంపై మంత్రివర్గంలో చర్చించారు. గతవారం మొక్కజొన్న క్వింటాకు రూ.2200 ధర ఉండగా, ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని, కనీస మద్దతు ధర రూ.1,750 కూడా రావట్లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మంత్రి మండలి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా కొనుగోళ్లు జరపాలని సీఎం జగన్ సూచించారు. మొక్క జొన్న రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జిల్లాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
[subscribe]