ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక గతేడాది లాక్డౌన్ సమయం నుంచి తన సేవా కార్యక్రమాలతో సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనుసూద్ పెద్దఎత్తున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా పలుప్రాంతాల నుంచి సహాయం కోసం వస్తున్న విజ్ఞప్తులపై వెంటనే స్పందిస్తూ, పరిష్కారం చూపుతున్న సోనూసూద్ పనితీరు గురించి మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
మంత్రి కేటీఆర్ పట్ల ప్రత్యేక గౌరవం : సోనూసూద్
తను చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలను, తన భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా సోనూసూద్ మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. తన తల్లి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సోనూసూద్ తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరం పట్ల, ఇక్కడి వ్యక్తుల పట్ల తనకున్న అనుబంధాన్ని కూడా సోనూసూద్ మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర పోషిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ కష్ట సమయాల్లో ప్రజలను వెంటనే ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ తెలిపారు. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్ కు లంచ్ ఏర్పాటు చేశారు. సోనూసూద్ చేపడుతున్న సేవ కార్యక్రమాలను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఐటి సెక్రటరీ జయేష్ రంజన్, సినీ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ