జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్న భవన నిర్మాణ కార్మికులకు ఆసరాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ పేరిట ఉచిత అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఆహారం అందించే ఈ శిబిరాలను పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వానికి ఇసుక వారోత్సవాలు చేయడానికి అయిదు నెలల సమయం కావాలా, యాభై మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోవాలా అని ప్రశ్నించారు. అయిదు నెలలు నిరీక్షించి, ఒక తప్పుడు పాలసీ విధానం ఆచరణలోకి తెచ్చి 50 మందిని బలిగొన్నారని విమర్శించారు.
సగటు మనిషి కోసం నిలబడాలి అని రాజకీయాలలోకి వచ్చాను, కార్మికులకు ఒకపూట భోజనంతో ఏమి మారదని, డొక్కా సీతమ్మ పేరు పెట్టి మేము అండగా ఉన్నామని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరాలను ప్రారంభించామని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన అన్నారు. ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇచ్చారని, కొత్త పాలసీ పేరుతో ప్రజల్ని ఇబ్బందులు పెడతారా, అసలు వైసీపీ నాయకులకు ఆకలి బాధలు తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కోపంతో నిర్మాణాలు ఆపేశారని, గత ప్రభుత్వంలో విధివిధానాలు నచ్చకపోతే అమరావతి పరిధిని తగ్గించండి లేదా మీరు పులివెందులలో రాజధాని పెట్టాలనుకున్న త్వరగా నిర్ణయించండని కోరారు. పనులు జరిగితే భవన నిర్మాణ కార్మికులు బ్రతుకుతారని, పనులు లేక ఎక్కడికో వేరే రాష్ట్రాలకు కార్మికులు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.
[subscribe]