టోక్యో పారాలింపిక్-2020 గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరాహితో, జపాన్ ప్రధాని యోషిహైడ్ సుగా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భారత జావెలిన్ త్రోయర్ టేక్ చంద్ భారత జెండాని పట్టుకుని ముందుకు సాగగా, మిగతా భారత బృందమంతా భారత జెండాలను రెపరెపలాడిస్తూ ముందుకు కదిలారు. భారత బృందం స్టేడియంలోకి ప్రవేశించగానే టీవీలో వీక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ భారత అథ్లెట్లను ఉత్సాహపరుస్తూ, ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడా శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రమాణక్ కూడా భారత బృందానికి అభినందనలు తెలిపారు.
టోక్యో పారాలింపిక్స్-2020 ఆగస్టు 24, 2021 నుంచి సెప్టెంబర్ 5, 2021 వరకు జరగనున్నాయి. మొత్తం 22 క్రీడలలో 539 పతకాలకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ గేమ్స్ లో 163 దేశాల నుంచి దాదాపు 4,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇక భారత్ నుంచి 9 క్రీడా విభాగాలకు చెందిన మొత్తం 54 మంది అథ్లెట్ల బృందం పారాలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్నారు. పారాలింపిక్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ తరపున పాల్గొన్న బృందాల్లో ఇదే అతిపెద్ద బృందం. ఈసారి భారీగా పతకాలు సాధించే లక్ష్యంతో భారత బృందం బరిలోకి దిగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ