బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు (సెప్టెంబర్ 17, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మల్ సమీపంలోని ఎల్లపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అమిత్ షా నాందేడ్ చేరుకోనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ముద్ఖేడ్ సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటడం సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెయ్యి ఊడల మర్రిని సందర్శించనున్నారు. ఇక అక్కడ నుంచి బహిరంగ సభ జరిగే ఎల్లపల్లి క్రూజర్ గ్రౌండ్ కు చేరుకొని, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని అమిత్ షా ప్రసంగించనున్నారు.
నిర్మల్ లో భారీ బహిరంగసభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానుండడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టిసారించి ఏర్పాట్లు పూర్తిచేసింది. 8 ఎకరాల స్థలంలో సభ జరగనుండగా, వర్షం ఇబ్బంది కలిగించినా ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో భారీస్థాయి ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటుతో పాటుగా, వాహనాల పార్కింగ్ కు కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. ఇక బీజేపీ శ్రేణులు పెద్దస్థాయిలో జన సమీకరణ చేపడుతున్నాయి. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ఛుగ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర బీజేపీ కీలక నేతలు, నాయకులు, కార్యకర్తలు ఈ సభలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు పాదయాత్రకు విరామమిచ్చి, ఇతర నాయకులతో బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిర్మల్ లో కేంద్ర భద్రత బలగాలు, ఇంటెలిజెన్స్, రాష్ట్ర పోలీసులు ఆధ్వర్యంలో పెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ