కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నాడు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళన ప్రారంభించి 10 నెలలు పూర్తవుతున్న సందర్భంగా రైతులు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. భారత్ బంద్ కు దేశంలో కాంగ్రెస్, ఎస్ఏడీ, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, సమాజ్వాదీ, డీఎంకే, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీ సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభించారు. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రైతులు బంద్ లో భాగంగా రైల్ రోకో నిర్వహించడంతో రైళ్లు సైతం నిలిచిపోయాయి.
బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ/ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, వ్యాపార/వాణిజ్య సంస్థలు కూడా తెరుచుకోలేదు. రైతు మద్దతుదారులు, పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు నాయకులు, ప్రజా, వ్యాపార సంఘాల నాయకులు రోడ్లపైకి చేరుకొని రైతులకు మద్ధతుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బంద్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.
అయితే ఈ బంద్ నుంచి అత్యవసర సంస్థలు, అత్యవసర సేవలు, ఆసుపత్రులు, మెడికల్ స్టోర్స్, సహాయక చర్యలు మరియు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు హాజరయ్యే వ్యక్తులను మినహాయిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. సాయంత్రం 4 గంటల వరకు బంద్ నిర్వహిస్తామని రైతులు ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక భారత్ బంద్ నేపథ్యంలో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 27 మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నుండి బస్సులు యథావిధిగా నడుస్తాయని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ