నాలుగు రోజుల జమైకా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కింగ్స్టన్లోని నార్మన్ మ్యాన్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జమైకాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో తొలిసారిగా తమ దేశం సందర్శించిన రాష్ట్రపతి కోవింద్కు గార్డ్ ఆఫ్ హానర్ మరియు 21 గన్-సెల్యూట్ తో ఘన స్వాగతం అందించారు జమైకా అధికారులు. జమైకా గవర్నర్ జనరల్, జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్, క్యాబినెట్ సభ్యులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు పోలీసు కమిషనర్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మరోవైపు న్యూ కింగ్స్టన్లోని పెగాసస్ హోటల్కు చేరుకోగానే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జమైకన్లు మరియు ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు ఆయన భార్య ప్రథమ మహిళ సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్సభ ఎంపీ రమాదేవి, సతీష్ కుమార్ గౌతమ్, సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో కోవింద్ జమైకా మరియు సెయింట్ విన్సెంట్ & గ్రెనడైన్స్ దేశాల ప్రధానులు మరియు గవర్నర్లను కలవనున్నారు. జమైకా గవర్నర్ జనరల్ సర్ పాట్రిక్ అలెన్ మరియు ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్లతో సమావేశమైన ఆయన గవర్నర్ జనరల్ మరియు పీఎం హౌస్ను సందర్శిస్తారు. పీఎం హౌస్లో సంతకాల కార్యక్రమం (ఎంవోయూ ఒప్పందం) కూడా జరగనుంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు డా. భీమ్రావ్ అంబేద్కర్ పేరుతో ఉన్న “అంబేద్కర్ అవెన్యూ” రహదారిని ప్రారంభించనున్నారు. జమైకా-ఇండియా ఫ్రెండ్షిప్ గార్డెన్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం జమైకాలోని ఔత్సాహిక క్రికెటర్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్రికెట్ కిట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. భారత రాష్ట్రపతికి జమైకా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ భద్రతా అందిస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి కోవింద్ మే 15 నుండి 21 వరకు జమైకా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్లో పర్యటించాల్సి ఉంది. ఆయన ఇటలీలోని మిలన్లో ఒకరోజు పర్యటించాల్సి ఉండగా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆగిపోయిందని అధికారులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ