దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషి అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేవేసింది. తనకు విధించిన మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ అక్షయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై డిసెంబర్ 18, బుధవారం నాడు జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. దోషి కోరిన విధంగా తీర్పును పునఃసమీక్షించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం తెలిపింది. దోషికి మరణ శిక్షను ధృవీకరిస్తూ, నిర్భయ దోషులకు ఈ శిక్షే సరైనదని అభిప్రాయపడింది. అయితే గడువులోగా రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఈ తీర్పుపై అక్షయ్ న్యాయవాది స్పందిస్తూ, సుప్రీంకోర్టులో ముందుగా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఆ తర్వాతే క్షమాభిక్షకు వెళ్తామని చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తంచేసింది. అంతేగాక నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ కేసులోని మిగతా ముగ్గురు దోషులకు సంబంధించిన రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రివ్యూ పిటిషన్ పై మంగళవారమే విచారం జరపాల్సి ఉండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ విచారణ నుంచి తప్పుకున్నారు. గతంలో నిర్భయ తల్లి తరఫున ఈ కేసు వాదించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ బాబ్డే ప్రకటించారు. దీంతో మరో త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది.
[subscribe]