కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె – పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో ఈ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం సరఫరాపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో డిసెంబర్ 18, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఎన్ఎండీసీ డైరెక్టర్ అలోక్కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేస్తూ, ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకమని పేర్కొన్నారు.
మరోవైపు కడప స్టీల్ప్లాంట్ కు డిసెంబర్ 23, సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ శంకు స్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె గ్రామంలో 1758.08 ఎకరాలు, పెద్దదండ్లూరు గ్రామ పరిధిలో 1390.60 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్కు కేటాయించింది. ఈ భూమి యొక్క పొసేషన్ సర్టిఫికెట్ ను మంగళవారం నాడు ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ మధుసూదన్కు అప్పగించారు. సుమారు మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
[subscribe]