ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులు వారి ఆందోళనలు శాంతియుత పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పరిశీలిస్తున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 19, గురువారం నాడు రాజధాని గ్రామాల్లో బంద్ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఉద్దండరాయనిపాలెంలో సమావేశమైన రాజధాని రైతులు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. నిరసనల్లో భాగంగా రిలే నిరాహార దీక్షలు, రహదారుల ముట్టడి చేపట్టాలని తీర్మానించారు. అలాగే ఈ ఆందోళనలో అన్ని గ్రామాల రైతులు పాల్గొనాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం నాడు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులిచ్చిన బంద్ పిలుపు మేరకు పాఠశాలలు, వ్యాపార సంస్థలు, హోటళ్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే వెలగపూడిలో రైతులు, కూలీలు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించబోతున్నారు. బంద్ నేపథ్యంలో ఈ 29 గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
[subscribe]