హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి వారి ‘శ్రీరామనగరం’ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడి దివ్యక్షేత్రంలోని 216 అడుగుల ‘సమతామూర్తి‘ విగ్రహాన్ని దర్శించుకున్నారు. తర్వాత యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని 108 దివ్య క్షేత్రాలను సందర్శించారు. చినజీయర్ స్వామి దగ్గర ఉండి దివ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు.
ఈ సందర్భంగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీ రామానుజాచార్య ‘సమతామూర్తి’ ని దర్శించుకోవడం తన అదృష్టమని చెప్పారు. చినజీయర్ స్వామి చేస్తున్న ఈ మహాద్భుత సత్కార్యం వేలయేళ్లపాటు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. అనాదిగా సనాతన ధర్మం ఎన్నో కఠిన సవాళ్లకు ఎదురు నిలిచిందని అన్నారు. శ్రీ రామానుజాచార్యులు వేయి సంవత్సరాల క్రితం చేసిన ప్రభోదాలు ఇప్పటికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ఈ సందర్భంగా.. చినజీయర్ స్వామి హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేక శాలువాతో సత్కరించారు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ఇప్పటివరకు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ