ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. హైదరాబాద్ లోని ఓయూలో చదువుకుంటూనే తెలుగు సాహిత్యం, రచనలపై ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీ వాయ గువ్వా’ పాటతో ఆయనకు తొలి అవకాశం వచ్చింది. ఈ పాట హిట్ అవ్వటంతో చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావటం మొదలయ్యాయి. ఆ తరువాత ఇడియట్, సత్యం, పోకిరి, తదితర హిట్ సినిమాలలో ఆయన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
అయితే, చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న కందికొండ విధి వక్రీకరించి అనారోగ్యం పాలయ్యారు. వెన్నెముకకు సంబంధించిన సమస్యతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఒకవైపు అనారోగ్యం.. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమాల చిత్రీకరణ నిలిచిపోవటంతో ఆయన కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, ఈ పరిస్థితులలో కందికొండ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. వైద్య సహాయానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చారు. గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కానీ, ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసిన చిత్రప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ