ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. యోగితో పాటుగా 52 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన లక్నో లో కొత్త కేబినెట్ తోలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లేదా ఉచిత రేషన్ పథకాన్ని జూన్ 30, 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకున్న తొలి నిర్ణయంగా ఇది నిలిచింది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని రాష్ట్రంలో మార్చి 31 నుండి జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యం (బియ్యం/గోధుమలు) అదనంగా లభిస్తాయని, కొత్త కేబినెట్ తొలి నిర్ణయమైన దీన్ని పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.3,270 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ