ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చేరుకున్న అనంతరం దేశంలో హీట్ వేవ్ మేనేజ్మెంట్ మరియు వర్షాకాల/రుతుపవనాల సన్నద్ధతకు సంబంధించిన పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) దేశవ్యాప్తంగా మార్చి-మే 2022లో అధిక ఉష్ణోగ్రతల నమోదు వివరాలను ప్రధానికి తెలియజేశాయి. రాష్ట్ర, జిల్లా మరియు నగర స్థాయిలలో ప్రామాణిక ప్రతిస్పందనగా హీట్ యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేయాలని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్టు తెలిపారు. నైరుతి రుతుపవనాల సన్నద్ధత గురించి, అన్ని రాష్ట్రాలు ‘వరద సంసిద్ధత ప్రణాళికలు’ సిద్ధం చేయాలని మరియు తగిన సన్నద్ధత చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక వరద ప్రభావిత రాష్ట్రాల్లో తన విస్తరణ ప్రణాళికను అభివృద్ధి చేయాలని ఎన్డీఆర్ఎఫ్ కు ఆదేశాలు ఇచ్చారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, వేడిగాలులు లేదా అగ్ని ప్రమాదం కారణంగా మరణాలు సంభవించకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే అటువంటి సంఘటనల పట్ల సహాయక బృందాలు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రతిస్పందించాలని అన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా నిత్యం ఆసుపత్రి ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక రాబోయే రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని, కలుషితాన్ని నివారించడానికి, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి త్రాగునీటి నాణ్యతను పర్యవేక్షించే ఏర్పాట్లను నిర్ధారించాల్సిన అవసరం ఉందని అధికారులను ప్రధాని ఆదేశించారు.
వేడిగాలులు, రాబోయే రుతుపవనాల నేపథ్యంలో దేశంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని వ్యవస్థలను సంసిద్ధంగా ఉండేలా కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీల మధ్య సమర్థవంతమైన సమన్వయం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, పీఎం సలహాదారులు, కేబినెట్ సెక్రటరీ, హోం, ఆరోగ్యం, జలశక్తి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఎన్డీఎంఏ సభ్యుడు, ఐఎండీ, ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ