భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది. తొలి టీ20 ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కావడంతో ఈ మ్యాచ్ కు అవే జట్లను కొనసాగిస్తారా, లేదా ఏదైనా మార్పులు చోటుచేసుకుంటాయా వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా భారత్ జట్టులో ఓపెనర్ స్థానంపై ఆసక్తికరచర్చ జరుగుతుంది. ఈ సంవత్సరం టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఓపెనింగ్ స్థానంలో ఆడే ఆటగాళ్లపై పూర్తీ స్పష్టత కోసం జట్టు యాజమాన్యం కసరత్తు చేస్తుంది. గాయంనుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ కు లోకేష్ రాహుల్ తో గట్టిపోటీ ఎదురవుతుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటుండడంతో రాహుల్, ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చాక రాహుల్, ధావన్ లలో ఎవరిని ఎంపిక చేయాలో అర్ధంకావడంలేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
మరోవైపు భారత్ యువ ఆటగాళ్లు సంజు శాంసన్, మనీశ్ పాండేలను శ్రీలంకతో తోలి టీ20కి రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యారు. దేశవాళీ, ఐపీఎల్లలో రాణించినా అనంతరం కొన్ని సిరీస్ ల నుంచి భారత్ జట్టులో చోటు దక్కించుకుంటున్న శాంసన్ కు తుది జట్టులోకి మాత్రం అవకాశం కల్పించకపోవడంతో మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానుల నుంచి టీం యాజమాన్యం విమర్శలు ఎదుర్కొంటుంది. రెండో టీ20లోనైనా శాంసన్ కి ఛాన్స్ ఇస్తారో లేదో వేచిచూడాలి. గాయం నుంచి కోలుకుని నాలుగు నెలల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్లో సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు. అలాగే శ్రీలంక తొలి టీ20లో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యుస్ను పక్కనపెట్టింది. రెండో టీ20లో మాథ్యుస్ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. బ్యాటింగ్కు అనుకూలమైన హోల్కర్ స్టేడియంలోని పిచ్ పై భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉండడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వేచిచూస్తున్నారు.