మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం నాడు చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టాలని రైతులు నిర్ణయించగా, టీడీపీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నేతలను జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. నాయకులను గృహ నిర్బంధం చేసిన విషయం తెలుసుకుని కార్యకర్తలు వారి ఇళ్లకు చేరుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు ఉమా ఇంటికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేయడంతో, ఆయన పోలీసులనుంచి తప్పుంచుకుని బలవంతంగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం కార్యకర్తలుతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. అలాగే తన ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దారుణంమని, ఇవాళ చీకటిరోజని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు విజయవాడలో ఎంపీ కేశినేని నానిని, తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ను, డొక్కా మాణిక్య వరప్రసాద్ను, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును, మాజీ మంత్రి నక్కా ఆనందబాబును, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటుగా పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. రహదారి దిగ్బంధన కార్యక్రమంలో పాల్గొనకుండా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాయకుల ఇళ్ల వద్ద పలుచోట్ల పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అలాగే సీఎం ఈ రోజు సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో మందడంలో తలపెట్టిన మహాధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. రైతులను రహదారిపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అంతేగాక రహదారికి దగ్గరగా ఉన్న పలు దుకాణాలను మూసివేయించారు. దీంతో ఆప్రాంతంలో వ్యాపారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకోసమే ముందస్తుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
[subscribe]