2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7, మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు దోషులకు కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. అలాగే జనవరి 22 ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇక మిగిలిన 14 రోజుల్లో దోషులు న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని సూచించింది. నిర్భయ కేసులో దోషులకు వెంటనే మరణ శిక్ష విధించాలని కోరుతూ బాధితురాలి తల్లి పాటియాలా హౌస్ కోర్టు ఆశ్రయించడంతో, విచారణ చేపట్టిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును వెల్లడించింది. అయితే తీర్పుపై తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దోషుల తరపు న్యాయవాది ఎపి సింగ్ మీడియాకు తెలిపారు.
కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు మహిళలకు నాయవ్యవస్థ పట్ల ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని అన్నారు. ఇన్నాళ్లకు తమ కుమార్తెకు న్యాయం జరిగిందని, నలుగురు దోషులను ఉరితీయడం వలన దేశ మహిళలకు కొత్త శక్తి వస్తుందని, అలాగే న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని ఆమె అన్నారు. నిర్భయ తండ్రి మాట్లాడుతూ, కోర్టు తీర్పు వలన తనకు సంతోషంగా ఉందని, ఈ నిర్ణయం నేరాలకు పాల్పడే వ్యక్తులలో భయాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు దోషుల యొక్క ఉరిశిక్ష రివ్యూ పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. ముందుగా గత జూలైలో ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26) వేసిన పిటిషన్లు కొట్టివేయగా, డిసెంబర్ లో అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
[subscribe]