భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో భారత్ జట్టు ఛేదించింది. ఈ విజయంతో భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. భారత్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(45), శిఖర్ ధావన్(32) పరుగులతో రాణించి మొదటి వికెట్కు 71 పరుగులు జోడించారు. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టాక శ్రేయస్ అయ్యర్(34), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30) దీటుగా ఆడడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో శ్రేయస్ అయ్యర్ ఔటవ్వగా, కోహ్లీ కళ్ళు చెదిరే సిక్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 2వికెట్లు, లహిరు కుమార ఒక వికెట్ పడగొట్టారు.
ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో భారీ స్కోరు చేయకుండా శ్రీలంక ఆటగాళ్లను కట్టడి చేశారు. శ్రీలంక జట్టులో కుశాల్ పెరీరా (34), అవిష్క ఫెర్నాండో(22), గుణతిలక(20) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్, నవ్దీప్ సైని చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించింది. ఇక మూడో టీ20 మ్యాచ్ జనవరి 10న పుణెలో జరగనుంది.