నేను ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వైసీపీ ఎలా నిర్ణయిస్తుంది? అని సూటిగా ప్రశ్నించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం తిరిగి మంగళగిరి చేరుకున్న జనసేనాని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావసారూప్య పార్టీలతో, వ్యక్తులతో, సంస్థలతో కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు అన్న అంచనాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంటుందా అన్న ప్రశ్నకు జనసేనాని సమాధానమిచ్చారు. ఏపీ బాగుండాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా వుండాలని, దీని విషయంలో ఓ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని తాము భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం అన్నది చాలా చిన్న పదమని, దీనికే వైసీపీ ఎందుకంతగా భయపడుతోందని ప్రశ్నించారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్నామని, ముందు ముందు కూడా కొనసాగుతామని చెప్పారు.
అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే విషయంలో ఇతర పార్టీలతో పొత్తు విషయానికి సంబంధించి బీజేపీని ఒప్పించటానికి ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోవాలో వైసీపీ ఎలా నిర్ణయిస్తుంది?.. నేను చెప్పిన వాళ్లకు వైసీపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే నన్ను ఓడిస్తామన్న వైసీపీ నాయకుల సవాల్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. ఇక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ