ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఒక ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. మృతి చెందినవారందరినీ మహిళా కూలీలుగా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలేమైందంటే.. తాడిమర్రి మండలం లోని గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన సుమారు 12 మంది కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఆటోపై హైటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగి ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. డ్రైవర్ సహా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు.
అయితే ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి ప్రయాణిస్తున్న కూలీలు మృతి చెందడం విచారకరమన్నారు. అలాగే ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవాలని రాజ్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ