తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది. దరఖాస్తులు ఎడిట్/సవరణకు అభ్యర్థులకు జూలై 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
గ్రూప్-1 సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు, దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లినందున సవరణ సదుపాయాన్ని అందించాలని టీఎస్పీఎస్సీకి నివేదించారు. దరఖాస్తుదారుల అభ్యర్థనల ఆధారంగా, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.inలో ఆన్లైన్ సవరణ సౌకర్యం జూలై 19 నుంచి 21 వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. బయో-డేటా వివరాలు (పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మొదలైనవి), అప్లికేషన్లోని అర్హత/ఫోటో/సంతకం/డేటా దిద్దుబాట్లు మొదలైనవి ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించుకుని అభ్యర్థులు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు అభ్యర్థులు ఓటీఆర్/అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేసినప్పుడు, అందుకు సంబందించిన సర్టిఫికేట్లను తప్పనిసరిగా దిద్దుబాటు రుజువుగా అప్లోడ్ చేయాలని చెప్పారు.
కేటాయించిన తేదీలలో ఎడిట్ ఆప్షన్ ను అభ్యర్థి ఉపయోగించకుంటే టీఎస్పీఎస్సీ ఎలాంటి బాధ్యత వహించదని, ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా ఫైనల్గా పరిగణించబడుతుందని అన్నారు. అలాగే చివరగా ఎడిట్ చేసిన డేటానే ఫైనల్గా తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను జనవరి/ఫిబ్రవరి 2023 లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY