రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానలు, వరదలు, అలాగే రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతున్నది. గోదావరి ఉప నదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయి. పడ్డ చుక్క పడ్డట్టే వాగులు వంకలు దాటి, చెరువులు, కుంటలు పొంగి నదులకు చేరుకుంటున్నది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవలి కంటే ఎక్కువ స్థాయిలో వరదలు సంభవించే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి” అని ఆదేశించారు.
కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని సీఎం అన్నారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇపుడు కురిసే వానలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉధృతంగా ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య, ఆరోగ్యం, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, పురపాలక శాఖలు, మిషన్ భగీరథ బృందం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.
పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇక హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి సీఎం తెలుసుకున్నారు.
మరోవైపు ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎట్లా వస్తున్నాయనే విషయాలను సీఎంకు వివరించారు. భారీ వర్షాలతో గోదావరి నదీ ప్రవాహం ఎస్సారెస్పీ నుంచి, కడెం నుంచి వస్తున్న ప్రవాహాలను, గంట గంటకూ మారుతున్న వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సీఎంకు పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY