మలేషియాకు చెందిన ప్రముఖ డీఎక్స్ఎన్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యనున్న నాగార్జునసాగర్ సమీపంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా ‘సున్య ఇంటర్నేషనల్’ పేరుతో ఒక పెద్ద ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. నాగార్జున కొండకు సమీపంలోని పల్నాడు జిల్లా మాచర్ల వద్ద 110 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడానికి డీఎక్స్ఎన్ మాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది.
ఈ మేరకు శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కలిసి ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం 99 ఏళ్లకు 110 ఎకరాలను లీజు విధానంలో కేటాయించాల్సిందిగా ఆయనను కోరారు. ఇక ఈ సెంటర్లో 1,000 మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా అతి పెద్ద మందిరం నిర్మించనున్నామని, అలాగే ఔషధ వనం ఏర్పాటు చేసి ఆయుర్వేద మందులను తయారు చేసే యూనిట్ను కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇంకా పర్యాటకుల ఆరోగ్యం దృష్ట్యా 50 పడకల హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయనున్నామని వారు పేర్కొన్నారు. వీటితో పాటుగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా 7 స్టార్ హోటల్ సదుపాయాలతో ఒక భారీ రిసార్ట్ నిర్మిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ సందర్శనకు ఏటా లక్ష మంది పర్యాటకులు ‘సున్య ఇంటర్నేషనల్ సెంటర్’కు వచ్చే అవకాశం ఉందని, దీనిద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. అయితే డీఎక్స్ఎన్ ప్రతిపాదనలపై స్పందించిన గోవింద్ రెడ్డి ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వారికి తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ