భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (జూలై 25, సోమవారం) పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ము చేత ప్రమాణం చేయించారు. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, దేశ కీలక సైనికాధికారులు, విదేశీ దౌత్యాధికారులు, ఉన్నతాధికారులు, ద్రౌపది ముర్ము కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం అనంతరం సైన్యం 21 గన్ సెల్యూట్ తో ఆమెకు గౌరవ వందనం సమర్పించింది. సైనిక వందనం తర్వాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలిసారిగా కీలక ప్రసంగం చేశారు.
ఇక సోమవారం ఉదయం ముందుగా ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాజ్ఘాట్కు చేరుకుని జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు వెళ్లగా రామ్ నాథ్ కోవింద్ మరియు ఆయన సతీమణి సవితా కోవింద్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, సాదరంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి రామ్ నాథ్ కోవింద్ తో కలిసి ద్రౌపది ముర్ము పార్లమెంట్ కు చేరుకోగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ద్రౌపది ముర్ము దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి కాగా, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మొట్టమొదటి గిరిజన మహిళగా మరియు స్వాత్రంత్య్ర భారతదేశంలో జన్మించి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. మరోవైపు జూలై 25కు భారతదేశ చరిత్రలో ప్రత్యేకత స్థానం ఉంది. భారత ఆరో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి, 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వరకు జూలై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేశారు. నీలం సంజీవరెడ్డి నుంచి దేశ అత్యున్నత పదవిని చేపట్టిన వారంతా, తమ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆనవాయితీగా తదుపరి రాష్ట్రపతులందరూ జూలై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తూ వస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేపథ్యం:
ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు. ద్రౌపది ముర్ము తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక భువనేశ్వర్లోని సచివాలయంలో క్లర్క్ గా మరియు నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయురాలిగా, గౌరవ అసిస్టెంట్ టీచర్ గా కూడా పనిచేశారు. 1997లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా రాజకీయప్రవేశం చేశారు. ముందుగా రాయ్రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్ గా ఆమె ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఒడిశా 2000 అసెంబ్లీ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బిజూజనతాదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2002-02 వరకు వాణిజ్యం, రవాణా మరియు 2002-04 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాయరంగ్పూర్ నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఆమె విజయం సాధించారు. ఇక రాష్ట్ర బీజేపీలో మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, అలాగే బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ స్థాయిల్లో ఆమె సేవలు అందించారు. అనంతరం మే 18, 2015 నుంచి జూలై 12, 2021 వరకు ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. ఇక ఇటీవల జరిగిన 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఘన విజయం సాధించి, నేడు బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY