ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు శుభవార్త. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ పథకం కింద నిధులు పంపిణీ చేసారు. బుధవారం ఆయన బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును నేరుగా జమ చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు దీని ద్వారా లబ్ది చేకూరనుంది. ఇక నగదు పంపిణీ అనంతరం లబ్దిదారులనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు వ్యాపారులకు అండగా ఉండాలని భావించి ఈ ‘జగనన్న తోడు’ పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. స్వయం ఉపాధిని ప్రోత్సహించడమని, తద్వారా తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా తమతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించేలా తయారుచేయడమని సీఎం తెలిపారు.
ఇక ఈరోజు 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, అలాగే గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను కూడా జమ చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి బ్యాంకుల ద్వారా ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామని, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తన పాదయాత్ర సమయంలో ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, అలాగే సైకిల్, మోటర్ సైకిళ్ళు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారి కష్టాలు చూశానని, అందుకే అధికారంలోకి రాగానే వారికి చేయూతనిచ్చేలా ఈ పథకం రూపొందించామని వెల్లడించారు. అర్హత ఉండీ, జాబితాలో పేర్లు నమోదు కానివారు కంగారు పడాల్సిన పనిలేదని, సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY