ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. దీని ప్రకారం ఇకపై “మంగలి, మంగలోడా, బొచ్చు గొరిగే వాడా, మంగలిది, కొండ మంగలి” వంటి అభ్యంతరకర పదాలను నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగించినట్లయితే నాయీ బ్రాహ్మణుల మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. తద్వారా అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో సొంతంగా సెలూన్లు నడుపుకుంటున్న నాయీ బ్రహ్మణులకు ఏడాదికి పది వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వారికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాయీ బ్రహ్మణుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందనే వాదన నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకించి సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి తమ ఆనందం వెలిబుచ్చుతున్నారు. అలాగే జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి తమ ఆత్మగౌరవాన్ని చాటుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో.. తెలంగాణలోనూ దీనిని అమలు చేయాలంటూ ఆ సామజిక వర్గం నుంచి వినతులు వస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన, నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ