దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ ప్లాంటు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ ప్లాంటులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే 1.1 బిలియన్ డాలర్లు విలువైన కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ కథనాన్ని రాయడంతో ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ, కియామోటార్స్ తరలిపోతుందనే ప్రచారాన్ని ఖండించింది. రాయిటర్స్ కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ పేర్కొన్నారు. కియా సంస్థ, ఏపీ ప్రభుత్వం రెండు కలిసే పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. మరోవైపు కియా మోటార్స్ కూడా రాయిటర్స్ కథనాన్ని తప్పుబట్టింది. ప్లాంట్ను తరలించే ఆలోచనలేవీ లేవని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తితో అంచనాలకనుగుణంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం ఆశ్చర్యం కలిగించిందని వారు పేర్కొన్నారు.
[subscribe]