అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 5, బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ ట్రస్ట్కు కేంద మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రస్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో
15 మంది సభ్యులు ఉంటారని, అలాగే అందులో దళిత వర్గానికి చెందిన వారు ఒకరు ఉంటారని చెప్పారు. మందిర నిర్మాణంకోసం ఏర్పాటుచేసిన ఈ ట్రస్ట్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ప్రముఖ న్యాయ కోవిదుడు పరాశరన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. మరోవైపు రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా ఈ ట్రస్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి నగదును విరాళంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము ప్రభుత్వం తరఫున ట్రస్ట్ సభ్యులకు ఒక రూపాయి నగదును అందజేశారు. అలాగే రామమందిర నిర్మాణం కోసం నగదు, ఆస్తుల రూపంలో ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని, ఎటువంటి షరతులు లేకుండా విరాళాలను స్వీకరించనున్నట్లుగా ట్రస్టు ప్రకటించింది.
[subscribe]