తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 5, బుధవారం నాడు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహాన్, హైదరాబాద్ మెట్రో రైల్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖాధికారులు, నగర పోలీస్ కమీషనర్, ఎల్ అండ్ టి ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7వ తేదిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోరైలు కారిడార్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు.
ఈ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందువలన ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని మెట్రో రైల్ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. పీపీపీ పద్ధతిలో నిర్మించబడిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైల్ ప్రాజెక్టని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనత సాధించే క్రమంలో అందుకున్న మైలురాళ్లు, అవార్డులు, ఇతర మెట్రో సంబంధిత విషయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ మెట్రోరైల్ నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
[subscribe]