ఎల్బీస్టేడియంలోని ఒలింపిక్ భవన్ లో ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరిగిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన జయేశ్ రంజన్, రంగారావు ప్యానళ్ల మధ్య ముందు నుంచే తీవ్ర పోటీ నెలకుంది. మధ్యాహ్నం 1 గంటకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా జయేష్ రంజన్ కు 46 ఓట్లు, రంగారావుకు 33 ఓట్లు వచ్చాయి. దీంతో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జయేశ్ రంజన్ విజయం సాధించినట్లు రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు ఉపాధ్యక్షుడుగా వేణుగోపాల్ చారీ, ప్రధాన కార్యదర్శిగా కె. జగదీశ్వర్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా నార్మన్ ఇసాక్, కోశాధికారిగా కె.మహేశ్వర్ ఎన్నికయ్యారు.
[subscribe]