హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని, దేవాలయానికి ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని అక్చరుద్దీన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేశారు.
లాల్ దర్వాజ మహంకాళి దేవాలయ ప్రాంగణంతో పాటు దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. అలాగే పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. ఎంతో మంది ముస్లింలు ఈ మసీదులో నిత్యం ప్రార్థనలు చేస్తారనీ, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అక్బరుద్దీన్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
[subscribe]