ఫిబ్రవరి 18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఈనెల 18వ తేది ఉదయం 10గంటలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ను ప్రారంభించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ముందుగా మొత్తం 12 కంపెనీలతో ఎంవోయూలు చేసుకొని ఐటీ టవర్ ను ప్రారంభించాలని భావించామని, కానీ ఇప్పటి వరకు 18 కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంప్రదించాయని మంత్రి కమలాకర్ తెలిపారు. ప్రాంతీయ కంపెనీలతో పాటుగా పలు మల్టినేషనల్ కంపెనీస్(ఎంఎన్సీలు) కూడా కరీంనగర్లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
ఒక సంవత్సరం తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవం నాడు పలువురికి నియామకపత్రాలు కూడా అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను ఎంపీగా, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చేసిన ఆలోచనే నేడు ఐటీ టవర్ గా మారి అనేక కంపెనీలు జిల్లాకు వచ్చేలా దోహదపడిందని అన్నారు. ఐటీ టవర్ ప్రారంభంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.
[subscribe]