తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్ను సందర్శించారు. కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు పర్యాటక, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కూడా ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ముందుగా గతకొన్ని రోజులుగా క్యాంపస్ లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో మంత్రులు మాట్లాడారు. అలాగే విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు.
క్యాంపస్ లో సమస్యలపై గతంలో ఆందోళన చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ఆందోళనను ప్రతీ రోజు పేపర్లు, టీవీల్లో చూశానని, రాజకీయ నాయకులకు చోటివ్వకుండా, రాజకీయాలకు అతీతంగా స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ గా ఏర్పడి మీ సమస్యల పరిష్కారం కోసం పోరాడారని విద్యార్థులనుద్దేశించి అన్నారు. గాంధీ సత్యాగ్రహ తరహాలో పద్దతిగా, శాంతియుతంగా, వానలో కూడా బయట కూర్చోని కొట్లాడిన పద్దతి నచ్చిందన్నారు. కేవలం ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికే ఆందోళన చేస్తున్నామని చెప్పారని, అందుకు విద్యార్థులకు అభినందనలు చెబుతున్నానని అన్నారు. విద్యా వ్యవస్థను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిందన్నారు. అయితే భవన నిర్మాణం చేయడం తేలిక అనను కానీ, ఆతర్వాత వసతుల నిర్వహణ సవాల్తో కూడుకున్న విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు.
హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో తన తెలుసనని, ఫుడ్, వసతులపై ఉండే సమస్యలు తనకు తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందింస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీకి అనేక కొత్త మౌలిక సదుపాయాలను ప్రకటించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరికీ నవంబర్ నెలలో ల్యాప్టాప్లు అందజేస్తామని చెప్పారు. అలాగే మినీ టి-హబ్ లేదా ఇన్నోవేషన్ సెంటర్, 50 అదనపు మోడర్న్ క్లాస్ రూముల ఏర్పాటు, 1000 కంప్యూటర్లతో అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు, క్యాంపస్ లో స్పోర్ట్స్ స్టేడియానికి 3 కోట్లు కేటాయింపు, ఆడిటోరియం అభివృద్ధి కోసం కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. క్యాంపస్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలని మంత్రి సూచించారు. క్యాంపస్లో శుభ్రత పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని, నెలకొకసారైనా శ్రమదానం చేపట్టాలన్నారు. ఈ సంస్థ మీదేనని, మీరే కాపాడుకోవాలని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY