కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ పలు కన్నడ సంఘాలు ఈరోజు నుంచి రెండ్రోజులు పాటు బంద్ కు పిలుపునిచ్చాయి. కన్నడ సంఘాలు పిలుపుమేరకు జరుగుతున్న బంద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి నుంచి మంగుళూరు వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకశాఖ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బంద్ కు హోటళ్లు, క్యాబ్లు, ఆటోల సంఘాల్లో కొందరు మద్దతు తెలుపగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరోజినీ బిందురావ్ ఇచ్చిన నివేదికను తక్షణమే అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు రేపు కన్నడ సంఘాలు నివేదికను సమర్పించనున్నాయి.
అలాగే బంద్ పై యడియూరప్ప స్పందిస్తూ, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. సరోజినీ బిందురావ్ మహిషి నివేదిక అమలు కోసం ఇప్పటికే సాధ్యమైనవన్నీ చేశామని, ఈ అంశంపై చర్చించేందుకు ఎల్లప్పుడూ సిద్దమని ప్రకటించారు. మరోవైపు బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెంగుళూరు, ఇతర అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పెంచుతున్నట్టు బెంగుళూరు నగర కమిషనర్ భాస్కరరావు వెల్లడించారు.
[subscribe]