భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ టీ20 ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (63), టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్ (69) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి తమదైన శైలీలో సిక్సర్లు, ఫోర్లుతో ఉప్పల్ లో క్రికెట్ అభిమానులకు కనువిందు చేశారు. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) విఫలమైన అనంతరం, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయం వైపు నడిపించారు. సూర్య అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా దీటుగా ఆడి 25 పరుగులతో నాటౌట్ గా నిలిచి విన్నింగ్ షాట్ కొట్టి తనవంతు సహకారం అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ సామ్స్ 2, హజల్వుడ్, ఆడమ్ జంపాలు చెరో వికెట్ తీశారు.
ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో కామెరూన్ గ్రీన్ 21 బంతుల్లో 52, టిమ్ డేవిడ్ 27 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటగా, డానియల్ సామ్స్ (28), జోష్ ఇంగ్లిష్ (24) పరుగులతో రాణించారు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ పవర్ ప్లే లో భారత్ బౌలర్లపై విరుచుకుపడగా, టిమ్ డేవిడ్ చివరి ఓవర్లలో ఫినిషర్ పాత్ర పోషించాడు. మధ్యలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్ బౌలర్ల దాటికి వరుసగా వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తో పాటు రన్ అవుట్ లో కీలక పాత్ర పోషించగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా, సిరీస్లో 8 వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY