హైదరాబాద్ వేదికగా టీమిండియా నేడు ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో 200కి పైగా భారీ స్కోరు చేసి కూడా ఓడిపోయిన భారత్, రెండో మ్యాచ్ లో పుంజుకుంది. సెప్టెంబర్ 23, శుక్రవారం నాగ్పూర్లో వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. దీంతో నేడు జరిగే చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా రెండూ సిరీస్ని కైవసం చేసుకోవడంపై దృష్టి సారించాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా రెండో మ్యాచ్లో విజయంతో మంచి ఉత్సాహం మీద ఉంది. మరోవైపు ఆరోన్ ఫించ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్లో వలే ఈ మ్యాచ్లోనూ మళ్ళీ చెలరేగాలని భావిస్తోంది.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుండటం, అలాగే కరోనా కారణంగా గత రెండు సీజన్ల ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుపకపోవడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక శుక్రవారం నాటి మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టే సిరీస్ కైవశం చేసుకోనుంది. దీంతో నేటి మ్యాచ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్గా మారడంతో ఉత్కంఠ తారాస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ విజయం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. కాగా ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్లు అంచనా
భారత్: రోహిత్ శర్మ (సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్, కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY