భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు శుక్రవారం ముగ్గురు సీనియర్ నాయకులు నామినేషన్లు వేశారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మరియు కేఎన్ త్రిపాఠిలు నామినేషనలు దాఖలు చేశారు. వీరు అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో అందరూ ఈరోజే నామినేషన్స్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరూ తమకు ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఆఖరి రోజు పలు నాటకీయ పరిణామాల మధ్య దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఖర్గే అభ్యర్ధిత్వాన్ని సమర్థిస్తానని, ఆయనపై పోటీ చేయాలనుకోవడం లేదని వెల్లడించారు. అయితే ప్రధానంగా పోటీ మాత్రం ఖర్గే, థరూర్ మధ్యే జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నాకు మద్దతిచ్చినందుకు అన్ని రాష్ట్రాల సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అభిషేక్ సింఘ్వీ, అజయ్ మాకెన్, భూపీందర్ సింగ్ హూడా, దిగ్విజయ్ సింగ్, తారీఖ్ అన్వర్ సహా 30 మంది నేతలు ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. మరో అభ్యర్థి శశి థరూర్ నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు ఒక విజన్ ఉందని, దాన్ని ప్రతినిధులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇక వచ్చే నెల 17న ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇక త్రిపాఠి కాంగ్రెస్ అనుబంధ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (త్రిపాఠి వర్గం) జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY