దేశ రాజకీయాల్లో అభినవ చాణక్యుడిగా పేరొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తన సొంత రాష్ట్రం బీహార్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘జన్ సూరజ్’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆదివారం బాపూజీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లాలోని భీతిహర్వా గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మొత్తం 3,500 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇక్కడ నుండే మహాత్మా గాంధీ 1917లో తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అట్టడుగు స్థాయిలో ఉన్న సరైన వ్యక్తులను గుర్తించడం మరియు వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం, ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యాలు అని ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ పాదయాత్ర బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ రంగ ప్రవేశానికి నాందిగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ యాత్రలో ప్రశాంత్ కిషోర్ తన మద్దతుదారులతో కలిసి బీహార్లోని ప్రతి పంచాయతీని సందర్శించనున్నారు. కాగా ఆయన పాదయాత్ర పూర్తి కావడానికి దాదాపు 12 నుంచి 15 నెలల కాలం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మార్చ్ను ప్రారంభించే ముందు, ప్రశాంత్ కిషోర్.. ‘అత్యంత పేద మరియు అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బీహార్లో వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నట్లు హిందీలో ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది మేలో బీహార్ను మార్చే లక్ష్యంతో ‘జన్ సూరజ్’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY