నల్లగొండ జిల్లా మునుగోడులో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా సెలవును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ రోజైన నవంబర్ 3వ తేదీన స్థానికంగా సెలవు ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్న కార్యాలయాలు, సదరు సంస్థలకు ఎన్నికల ముందు రోజు కూడా సెలవు ఇవ్వాలని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయనున్న కార్యాలయానికి కౌంటింగ్ రోజున కూడా సెలవు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
కాగా మునుగోడు ఉపఎన్నికలో పలు పార్టీలు పోటీ చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యే ఉండనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. ఇటీవలి వరకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్, మళ్ళీ కోమటిరెడ్డిని గెలిపించుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదేక్రమంలో మరోవైపు టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో పాగా వేయడానికి సర్వ శక్తులు ఒడ్డుతోంది. దీంతో ఇక్కడ గెలుపు మూడు పార్టీలకు కీలకం కానుంది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలవగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY