టీ20 ప్రపంచ కప్-2022ను భారత్ జట్టు ఘనంగా ప్రారంభించింది. అక్టోబర్ 23, ఆదివారం నాడు సూపర్-12లో భాగంగా మెల్ బోర్న్ ఏంసీజీ స్టేడియంలో పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో భారత్ జట్టు సంచలన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో కింగ్ విరాట్ కోహ్లీ విజృంభణతో భారత్ జట్టు అద్భుతవిజయాన్ని దక్కించుకుంది. ఆఖరి బాల్ వరకు ఆసాంతం అత్యంత ఉత్కంఠగా మ్యాచ్ సాగగా, విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ విజయం సాధించగా, దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. పాక్ పై భారత్ విజయంతో దేశంలో దీపావళి పండుగా ఒకరోజు ముందుగానే వచ్చినట్లయి అనేక ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్, భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు చేసింది. పాక్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (4), బాబర్ ఆజామ్ (0) వెంటవెంటనే అవుట్ అయ్యారు. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ ఆడిన అర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ తో రిజ్వాన్, బాబర్ ను పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం షాన్ మసూద్ (52) తో కలిసి ఇఫ్తికార్ అహ్మద్(51) మంచి ఇన్నింగ్స్ ఆడడంతో పాక్ ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. ఇఫ్తికార్ ను షమీ అవుట్ చేశాక, మిగతా బాటర్లు చేతులెత్తేయడంతో, పాక్ స్కోర్ బోర్డులో వేగం తగ్గింది, చివర్లో షాహిన్ అఫ్రీది 16 పరుగులు సాధించాడు. భారత్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3/32, హార్దిక్ పాండ్యా (3/30), భువనేశ్వర్ కుమార్ (1/22), మహమ్మద్ షమీ (1/25) వికెట్ పడగొట్టారు.
అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఈసారి కూడా ఓపెనర్ల నుంచి సరైన ఆరంభం లభించలేదు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేఎల్ రాహుల్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (4) పరుగులకే వెనుదిరిగారు. రాహుల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ 15 పరుగులుతో, ఆతర్వాత అక్షర్ పటేల్ 2 పరుగులకే చేసి ఔట్ అయ్యారు. దీంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సంయమనంతో ఆడి జట్టును ఆదుకున్నారు. విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యాతో (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. చివరి మూడు ఓవర్లలో విజయం కోసం 48 పరుగులు సాధించాలి వచ్చింది. షాహిన్ అఫ్రీది వేసిన 18 ఓవర్లో 17పరుగులు, హరీష్ రౌఫ్ వేసిన 19 ఓవర్లో విరాట్ అద్భుతమైన 2 సిక్సర్లు బాదడంతో 16 పరుగులు, మహమ్మద్ నవాజ్ వేసిన 20వ ఓవర్లో 16 పరుగులు సాధించడంతో విజయం భారత్ సొంతమైంది.
మ్యాచ్ చివరి ఓవర్ క్రీడాభిమానులకు ఎంతోకాలం నిలిచిపోయేలా సాగింది. ఈ ఓవర్లో మొదటి బంతికే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. మొదటి మూడు బంతుల్లో కేవలం 3 పరుగులే రాగా, నాలుగో బంతిని విరాట్ కోహ్లీ సిక్స్ గా మలచడం, అది నోబాల్ కావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఫ్రీ హిట్ అయిన నాలుగో బాల్ ను నవాజ్ వైడ్ వేయగా, మరో బాల్ కూడా ఫ్రీ హిట్ గా ఉండడంతో కోహ్లీ బోల్డ్ అయినా కూడా బైస్ కింద కోహ్లీ, దినేష్ కార్తీక్ 3 పరుగులు తిరిగారు. ఐదో బంతికి దినేష్ కార్తీక్ అవుట్ అయ్యాడు. ఇక చివరిగా రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉండగా, చివరిగా 1 బాల్ కు రెండు పరుగులు చేయాల్సి ఉండడంతో నవాజ్ మళ్ళీ వైడ్ వేయడంతో స్కోర్స్ సమం అయ్యాయి. చివరి బంతిని అశ్విన్ ఓవర్ మిడ్ ఆఫ్ కు తరలించగా భారత్ ఖాతాలో గొప్ప విజయం చేరింది. చివరి వరకూ క్రీజ్లో ఉండి, నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మాజీ క్రికెటర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు భారత్ విజయంపై స్పందిస్తూ, కోహ్లీకి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇక టీ20 ప్రపంచ కప్ లో అక్టోబర్ 27న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY