హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 6 లేన్లతో కూడిన 990 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ను రూ.143.58 కోట్ల వ్యయంతో జీహెఛ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ డ్రైవ్ ఏర్పడడంతో పాటుగా, ఎల్బీనగర్ నుండి సికింద్రాబాద్ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ కు, అక్కడి నుంచి కనెక్టింగ్ జిల్లాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత మోతె, ఎమ్మెల్సీలు పి.మహేందర్రెడ్డి, బొగ్గరపు దయానంద్, యెగ్గే మల్లేశం, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ఎలా విస్తరిస్తుందో అందరికి తెలుసన్నారు. అందుకు తగ్గట్టుగా నగరంలో మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్డీపీ కింద అభివృద్ధి పనులు మొదలుపెట్టామని, మొదటి దశలో 8వేల కోట్లకు పైగా వ్యయంతో 47 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందులో ఒక్క ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతంలోనే 17 కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అలాగే వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కు అవార్డు అందరికి గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY