ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంపై వస్తున్న ఊహాగానాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. “ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాన్ని మా జనసేన పార్టీ గౌరవిస్తుంది. ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బహిర్గతం చేయాలనే ఆలోచన లేదు. ఈ సమావేశంపై వస్తున్న రకరకాల భాష్యాలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అని నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సమావేశంలో అంశాలని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లు గురించి స్పందించాల్సిన అవసరం లేదు ఆయన అన్నారు. ఉమ్మడి కడప జిల్లా పర్యటన కోసం రేణిగుంటకు చేరుకున్న నాదెండ్ల మనోహర్, శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుంది. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలోని సమావేశం జరిగింది. పదవుల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆలోచించరు. ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఆలోచించి మాత్రమే ఏ మాట అయినా మాట్లాడుతారు. వైసీపీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విషయాలు గురించి చర్చ జరిగింది. కొన్ని అంశాలు ఎన్నికల సమయంలో రాజకీయంగాను చర్చకు వస్తాయి. వాటికి రకరకాల భాష్యాలు చెప్పి, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశం విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. మరోవైపు అన్నమయ్య డ్యాం జల విలయానికి ఏడాది అయిన నేపథ్యంలో ఆ ప్రాంతాలలో నాదెండ్ల మనోహర్ శనివారం పర్యటించి బాధిత ప్రజలను కలువనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE