ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరుజిల్లాలోని పొత్తూరులో ఆయన జన్మించారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా వంటి సంస్థల్లో పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా సేవలందించారు. పలువురు జర్నలిస్ట్ యూనియన్ నేతలు పొత్తూరి మృతికి సంతాపం తెలిపారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాలకు పొత్తూరి చేసిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజం రంగంలో పొత్తూరి పాత్ర మరువరానిదని, అందరికీ ఆయన ఆదర్శప్రాయులని పేర్కొన్నారు.